ఆదర్శం

 

 

 

 

అన్ని దానాలని మించిన దానం  అన్నదానం అంటారు  - ఆ దానం కంటే మించిన దానం ఒకటుంది అని ప్రగాఢంగా నమ్మటమే కాదు ఆ దానం చేయడం కోసం తన జీవితాన్నే అంకితం చేసాడో వ్యక్తీ అతనే భద్రయ్య. అరవై  ఎనిమిదేళ్ళ వయసులో ఉదయాన్నే బయలు దేరి మద్యాహ్నం  దాకా ఊరంత  తిరిగుతూ అక్కడక్కడ ఏర్పాటు చేసిన  ట్యాంకుల్లో నీళ్ళు నింపుతూ ఉంటాడు ఆ ట్యాంకులన్ని అతను ఏర్పాటు చేసినవే స్వయంగా ఓ మినీ వ్యాన్ లోని ట్యాంకులో  నీళ్ళు నింపుకుని వెళ్ళే భద్రయ్య ఓ సాధారణ వ్యక్తీ.  తమలపాకుల వ్యాపారం చేసుకునే భద్రయ్య సంపాదన అంతంత మాత్రమే అయిన సరే ఎందరి దాహమో తీర్చాలనే తాపత్రయంతో రూపాయి రూపాయి సమకూర్చాడు.. గత ఇరవై ఎనిమిదేళ్ళుగా అంకిత భావంతో భద్రయ్య  చేస్తున్న సేవ గురించిన వివరాలోకి వెళితే...................

 

 

2. 28 ఏళ్ళ క్రితం ఓ  వేసవి మద్యాహ్నం ఓ నిరుపేద తల్లి తన కూతురితో కలసి మంచినీళ్ళ కోసం అర్ధించినపుడు గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలేకపోయాడు, దాహంతో ఆ తల్లి అతని ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సంఘటన భద్రయ్యని కలవరపరచింది , కలత చెందేలాచేసింది.. దాహం వేసినపుడు గుక్కెడు నీళ్ళు దొరకకపోతే మనిషి ప్రాణం ఎంత విలవిలలాడిపోతుందో  అనుకున్నాడు. ఓ వారం రోజులు కష్టపడి పదిహేడు రూపాయలు కూడబెట్టాడు. ఆ డబ్బుతో ఓ మట్టికుండను కొని తన షాపు ముందు పెట్టి రోజూ అందులో నీళ్ళు నింపేవాడు . ఆ తర్వాత దగ్గరలోని  వీధుల్లో కూడాకొన్ని కుండలు ఏర్పాటు చేసి వాటిల్లో కూడా నీళ్ళు నింపటం అతని దినచర్యలో భాగంగా మారింది..



౩        దాహం వేసినపుడు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చి ఆ దాహం తీర్చే వ్యక్తి' దేవుడిలా కనిపిస్తాడు, ఎవరికైనా, అలా అయితే భద్రయ్య బెంగుళూర్ లోని ఎందరో నిరుపేదలకి, చిరు వ్యాపారులకి, రోడ్డుపై వెళ్ళే వారికి దేవుడు. తన షాప్ ముందు కుండలో నీళ్ళు పెట్టడంతో మొదలైయిన భద్రయ్య ప్రయాణం ఆ తరువాత సిమెంట్ దిమ్మ మద్య  కదలకుండా  ఉండేలా ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ను అమర్చే దక సాగింది. అలా ఇప్పటికి బెంగుళూర్ మొత్తం మీద నాలుగు  వందల ట్యాంకులను  ఏర్పాటు చేసాడాయన.. ఆ ట్యాంకుల రక్షణ కోసం వాటి చుట్టూ ఇనుప గ్రిల్ ను కూడా నిర్మించాడు . వేసవిలో నీరు వేడేక్కకుండా  ట్యాంకు చుట్టూ ఇసుకపోసి దాన్ని నీళ్ళతో తడపడం మొదలుపెట్టాడు



4.  ఇప్పటికీ  అతనే స్వయంగా రోజూ ఆ ట్యాంకులని కడిగి  నీళ్ళతో నింపుతున్నాడు . ఇప్పుడు భద్రయ్య చేసే ఈ సేవలో అతని పిల్లలూ ఆనందంగా తమ సహాయం అందిస్తున్నారు .నీళ్ళ ట్యాంకులే కాదు, బస్సు షెల్టర్లు, రాతి బెంచీలు కూడా ఏర్పాటు చేసాడు ఎండ తీవ్రతతో సూర్యుడు  భయపెడితే చల్లని నీడనీ, మంచినీటిని అందిస్తూ భద్రయ్య భరోసా నిస్తున్నాడు..


5.       " పంచభక్ష్య పరమాన్నాలు వద్దు, డబ్బు వద్దు గుక్కెడు నీళ్ళు చాలు " దాహంతో విలవిలలాడే సమయంలో మనిషి అనుకునేది అదే, ఆ క్షణంలో  " ఒక్కగుక్కెడు మంచినీళ్ళు అందించిన వాడే అతనికి దేవుడు , అది నేనవుతున్నాను  ఆ తృప్తి చాలు "అనే  భద్రయ్య నేనేం చేయ్యగలను అని ప్రశ్నించే ఎందరికో  నిలువెత్తు జావాబు అనటం అతిశయోక్తి  కాదేమో. లక్ష్యాలు ఏర్పరచుకోవటం వాటిని సాధించాడంలో ఓ ఆనందం తృప్తి వుంటుంది . అదే ఆ లక్ష్యాలు పదిమందికి  సహాయపడినపుడు  ఆ తృప్తికి   అంతే వుండదు, అందుకు నిదర్శనం ఈ 68  ఏళ్ళ భద్రయ్య..