2004లో అభిమానం..2014లో అసహ్యం..

 

తెలుగు దేశం పార్టీ,నాయకులపై విమర్శలు చేయటంలో కయ్యానికి కాలు దువ్వుతారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.రోజా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పకిటికీ ఆమె భర్త సెల్వమణి రాజకీయాలపై మాట్లాడిందిగానీ, సభల్లో కనిపించిన దాఖలాలు గానీ ఎక్కడా లేవు. కానీ తాజాగా ఆయన చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరిలో వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహ్యించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

నియోజవర్గానికి తాను చేసిన అభివృద్ధి ఏంటో తెలుకునేందుకు మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని,దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని,తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు.