జగన్ పై దాడి..విచారణకు వైసీపీ నేత హాజరు

 

జగన్‌పై దాడి ఘటనకు సంబంధించిన శ్రీనివాసరావు పేరుతో నకిలీ కార్డు తయారు చేశారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు.గత నెలలో విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్షనేత జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి విదితమే.అయితే ఘటన అనంతరం దాడి చేయించింది చంద్రబాబు నాయుడేనని దాడి చేసింది టీడీపీ కార్యకర్తేనని జోగి రమేష్ ఆరోపించారు.తన దగ్గర ఆధారాలున్నాయంటూ నిందితుడు శ్రీనివాస్ టీడీపీ సభ్యత్వనమోదు కార్డును మీడియాకు విడుదల చేశారు.అయితే ఆ కార్డు నకిలీదని, దాన్ని తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత, ఏపీఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య జోగి రమేష్ పై గుంటూరు జిల్లా ఆరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.దీంతో  పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా జోగిరమేష్ కు నోటీసులు జారీచేశారు.ఆ కార్డు ఎలా వచ్చింది, ఎవరు తయారు చేశారు అన్న అంశంపై పోలీసులు ఆయన్ని విచారించేందుకు సిద్ధమయ్యారు.విచారణకు సిద్ధమైన జోగిరమేష్ తన అనుచరులతో కలిసి విజయవాడ నుంచి గుంటూరుకు చేరుకున్నారు.మరికాసేపట్లో జోగి రమేశ్‌  పోలీస్‌స్టేషన్‌లో హాజరుకానున్నారు.