ధర్మానకు చెక్ పెట్టనున్న జగన్
posted on Nov 12, 2018 4:25PM
విశాఖ భూ కుంభకోణంలో వైసీపి నేత ధర్మాన ప్రసాద రావు పేరు తెరమీదకు రావడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో ధర్మాన ప్రసాదరావు పై చర్యలు తీసుకుని పార్టీ సచ్చీలతను కాపాడుకోవాలని పార్టీ అదిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ధర్మానపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేత జగన్ రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జగన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అలాగే పార్టీలో క్రియాశీలంకంగా లేనివారిని పక్కన పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం నేత ధర్మాన ప్రసాదరావుకు జగన్ చెక్ పెట్టనున్నారని చర్చ జరుగుతోంది.
తాజాగా విశాఖ భూ కుంభకోణాలపై వచ్చిన సిట్ నివేదికలో ధర్మాన పేరు రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఇదే అంశం వైసీపిని కుదిపేస్తోంది.దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ధర్మానపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే ధర్మాన చేసిన అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని, ఇక ఆయనకు శిక్ష పడడం తప్పదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు ధర్మాన పనితీరు పై కూడా అసంతృప్తిగా ఉన్న జగన్ ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం జరగక ముందే ధర్మానపై చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ధర్మానకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కూడా కష్టమనే చర్చ జరుగుతోంది.