చంద్రబాబు ఫోన్ లాక్కున్న మార్షల్స్... బాలయ్యతో సెల్ఫీలకు వైసీపీ ఎమ్మెల్యేల పోటీ... 

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. మండలి సమావేశాలు అత్యంత ఉత్కంఠగా సాగుతున్న సమయంలో చంద్రబాబుతోపాటు గ్యాలరీకి వచ్చిన బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు సరదాగా ముచ్చటించారు. అనంతరం, వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కాసు మహేష్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్యచౌదరి, వసంత కృష్ణప్రసాద్, శ్రీనివాసులు తదితరులు బాలయ్యతో సెల్ఫీ దిగారు. దాదాపు పది పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ సెల్ ఫోన్లతో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేశారు.

అయితే, ఇక్కడే వివక్ష బయటపడింది. మండలి సమావేశాలు అత్యంత ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు కౌన్సిల్ కి వచ్చారు. అయితే, చంద్రబాబు గ్యాలరీలో కూర్చునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... సెల్ ఫోన్ ఇచ్చేయాలని మార్షల్ కోరారు. దాంతో, రూల్స్ అలాగే ఉంటే ఫోన్ తీసుకోండంటూ మార్షల్స్ ను ఇచ్చేసి గ్యాలరీలో కూర్చున్నారు చంద్రబాబు. అయితే, ఇక్కడే వివక్ష బయటపడింది. అదే మండలి గ్యాలరీలోకి పదుల సంఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వచ్చారు. అయితే, వాళ్లంతా సెల్ ఫోన్లు వినియోగించారు. బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.  

అయితే, చంద్రబాబు దగ్గర సెల్ ఫోన్ తీసుకున్న మార్షల్స్... మరి, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల దగ్గర ఎందుకు తీసుకోలేదని టీడీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. తమకో రూల్... అధికార పార్టీకో రూలా? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై మార్షల్స్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.