వారం రోజుల్లో పెళ్లి అనగా.. ప్రేమోన్మాది చేతిలో యువతి బలి

వారం రోజుల్లో పెళ్లి. ఆమెలో పెళ్లి కళ కూడా వచ్చేసింది. తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ లోగా ఘోరం జరిగి పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది దివ్య అనే యువతి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లోపలకు ప్రవేశించిన దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. గత రాత్రి గజ్వేల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటకు చెందిన దివ్య.. గజ్వేల్ లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తోంది. ఆమెకు వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో వివాహం కుదిరింది. ఈ నెల 26వ తేదీన వారి పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్ కూడా ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోచింగ్ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది.

ఇదే సమయంలో దివ్య తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి పనుల నిమిత్తం నిన్న ఉదయం ఎల్లారెడ్డిపేట వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా తనకు బ్యాంక్ లో పనులున్నాయని వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్ళింది. ఎప్పట్లాగే సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీ ప్రసన్న నగర్ లో తాముంటున్న ఇంటికి వచ్చింది దివ్య. తనకు కాబోయే భర్త సందీప్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది. ఇంతలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దివ్యపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయడంలో ఫోన్ లో మాట్లాడుతున్న సందీప్ కు వినిపించాయి. వెంటనే అతడు గజ్వేల్ లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో చుట్టు పక్కలవారు తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసే సరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో విచారణ చేశారు. కుమార్తె హత్యకు గురైందన్న సమాచారం తెలియడంతో దివ్య తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికొచ్చారు.

అయితే ప్రేమోన్మాదం తమ కుమార్తె హత్యకు కారణమని బోరున విలపిస్తున్నారు. గత కొంత కాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. దివ్య హైస్కూల్ లో చదువుకొనే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు కొన్నేళ్లుగా వేధింపులు తీవ్రతరం చేశాడని చెప్పారు. అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి నారాయణ తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు.