జీవితంలో చివరి నిరాహార దీక్ష... అన్నాహజారే 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులతో జరుగుతున్న చర్చలలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీంతో ఒక వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజరే.. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల సమస్యల అంశంపై తానూ ఈ నెలాఖరులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అయన పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని విమర్శించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ చట్టాల రూపకల్పన చేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఏరోజు దీక్ష చేస్తారన్న విషయాన్నీ మాత్రం అయన ఆ లేఖలో ప్రకటించలేదు.

 

ఇది ఇలా ఉండగా గత డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు అన్నా హజారే లేఖరాశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని.. అలాగే అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికీ తాను ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాశానని.. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని అన్నా హాజరే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన జీవితంలో చివరి నిరహార దీక్షను రైతుల కోసం చేయబోతున్నట్లు అయన స్పష్టం చేశారు.

 

దీనికోసం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరహార దీక్షకు అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు నాలుగు సార్లు లేఖ రాశానని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలిచింది. రామ్‌లీలా మైదానంలో అయన చేపట్టిన నిరహార దీక్షతో నాటి యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి,.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా అన్నా హజారే రైతుల సమస్యలపై దీక్ష చేయనున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.