బావురుమంటున్న భాగ్యనగరం...

నగరానికి ఏమయింది ? థియేటర్లలో ఈ యాడ్ చూసినపుడు.. ఏం కాలేదులే తీసెయ్యండయ్యా అని అనుకున్న వారు అనేక మందున్నారు.. మరిప్పుడు.. ఈ నగరానికి ఏమైంది?.. కరోనా వచ్చి కర్ఫ్యూ కోరల్లో కొట్టుమిట్టాడుతోంది.. భాగ్యనగరమంతాబావురుమంటోంది..వీధుల్లో వచ్చే పోయే వాహనాలు వట్టిపోయాయి..ఆ వాహన ప్రవాహం రోజంతా రయ్ రయ్ మని సాగేది..రోడ్లు దాటాలంటే బ్రహ్మ ప్రళయమే అయ్యేది..ఇపుడు ఇటూ అటూ చూడకుండా దాటిపోయే దారులయ్యాయి. బయటకు వెళ్లే బస్సులన్నీ బందయ్యాయి..ప్రయివేటు వాహనాలు సైతం పడకేశాయి..ఆటో రిక్షాలన్నీ అడ్రసు లేకుండా పోయాయి.. రహదారుల్లో రాకపోకలు రద్దయి పోయాయి..

విపత్తు లెన్నింటికో ఎదురొడ్డి నిలిచిన కలం యోధుల కలాలూ కరోనా కరోనా అంటూ కలవర పడుతున్నాయి..ప్రతిరోజూ పాజిటివ్, నెగటివ్ కేసుల లెక్కలు రాసేసుకుంటున్నాయి..కాంక్రీట్ జంగిల్లో కానరాని జనసంచారం . అంతటా అలుముకుంది నిశ్శబ్ద వాతావరణం..ఆలు మగలు అందరూ ఇళ్లకే పరిమితం..కడిగిన చేతులనే కడిగేసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో మునిగి తేలుతున్నారు.. చూసిన వాటినే టీవీల్లో చూసేసుకుంటున్నారు..ఇమ్యూనిటీ కోసం ఇష్టమైనవన్నీ తినేస్తున్నారు..మరచిపోయిన దేవుళ్లను మననం చేసుకుంటున్నారు..అయినా.. అందరికీ అదోరకం భయం..అదే.. కరోనా వచ్చి కాటేస్తుందనే కలవరం.. అందుకే మళ్లీ.. 

 

 

ఈ నగరానికి ఏమైంది? కాదు.. ఈ రాష్ట్రానికి ఏమైంది? కాదు కాదు.. ఈ దేశానికి ఏమైంది?కానేకాదు.. ఈ ప్రపంచానికి ఏమైంది? అని అడిగితే.. కరోనా ఓ శాపమై కూర్చుంది.. అయితే శాప విమోచనం అనేదీ ఉంటుంది..అయితే.. అదెప్పుడంటూ ఆశగా ఎదురు చూడడమే అందరి వంతయింది.