ఓటర్లని చావబాదారు.. గర్భిణికి గాయాలు!

 

బాధ్యతగల పౌరులుగా ఓటు వేయడానికి వెళ్ళిన ఓటర్లని పోలీసులు లాఠీలతో చావబాదారు. ఈ దుర్మార్గం మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలో జరిగింది. ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గర భారీ సంఖ్యలో ఓటర్లు క్యూలో నిల్చున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో వుండటం వల్ల కొంత తోపులాట జరిగింది. దాంతో అవకాశం దొరికింది కదా అని పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఓటర్లని నిర్దాక్షిణ్యంగా లాఠీలతో బాదడం ప్రారంభించారు. దాంతో ఓటర్లు చెల్లాచెదురైపోయారు. పోలీసులతోపాటు మరికల్ ఎస్.ఐ. శ్రీధర్ కూడా తన లాఠీకి పని చెప్పాడు. ఒక గర్భిణిని శ్రీధర్ విపరీతంగా కొట్టడంతో ఆమెకి గాయాలయ్యాయి. పోలీసుల దుర్మార్గాన్ని స్థానిక ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు.