కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గోతిలో విసిరేసి పూడ్చి పెట్టారు

దేశ వ్యాప్తంగా కరోనా తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కొన్ని నగరాల్లో కొత్తగా పాజిటివ్ గా తేలిన వారిని చేర్చుకునేందుకు హాస్పిటల్స్ లో బెడ్ లు ఖాళీ లేక పోవడం తో ఇంటి వద్దే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కరోనా తో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్య క్రియల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటక లోని బళ్లారికి సంబంధించిన వీడియోలు రెండు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో కొంత మంది పిపియి కిట్లు ధరించిన వ్యక్తులు కరోనా తో మరణించిన వారి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగులలో చుట్టి రెండు పెద్ద గోతులలో విసిరేసి కప్పి పెట్టినట్లుగా కనిపిస్తోంది.

బళ్లారి లోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ గత రెండు రోజులలో 18 మంది మరణించారు. ఐతే ఆ మృత దేహాలకు అంత్యక్రియల పై స్థానికులు అభ్యతరం చెప్పడంతో అధికారులే అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం గుగ్గరహట్టి లోని తుంగభద్ర ఎగువ కాల్వ కు కొద్దీ దూరంలో ప్రొక్లైన్ తో రెండు పెద్ద గోతులు తీసి ఉంచగా పిపియి కిట్లు ధరించిన ప్రభుత్వ సిబ్బంది నల్లటి ప్లాస్టిక్ బ్యాగులలోచుట్టిన మృతదేహాలను తీసుకు వచ్చి ఒక గోతిలో 8 మరో గోతిలో 10 మృతదేహాలను విసిరేసి పూడ్చి పెట్టారు. ఈ వీడియోలో ఉన్న వారి సంభాషణలు కూడా దారుణంగా ఉండడంతో ఈ వ్యవహారం పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఐతే వైరల్ అవుతున్న ఈ వీడియోల పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో బళ్లారి జిల్లా కలెక్టర్ స్పందించారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారికి జరిగిన అంత్యక్రియల తీరు పై మృతుల బంధువులకు అయన బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని పై విచారణకు ఆదేశించామని తప్పు చేసినట్లుగా తేలిన వారి పై చర్యలు తీసుకుంటామని అయన చెప్పారు. ఐతే ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితి కేవలం విదేశాలలోనే చూశాం. ఐతే ఇపుడు వచ్చిన ఈ వీడియోతో మన దేశం లోని పరిస్థితుల పై ప్రజలలో ఆందోళన నెలకొంది.