వైకాపాలో చేరిన అనంత వెంకట్రామి రెడ్డి
posted on Mar 10, 2014 11:18AM
సీమాంధ్రలో కాంగ్రెస్ బలమైన నాయకులంతా ఒకరి వెనుక ఒకరు పార్టీని వీడి వేరే పార్టీలోకి వలసలు వెళ్ళడంతో ఆ పార్టీ అధిష్టానం దిక్కుతొచని స్థితిలో పడిపోయింది. తాజాగా అన౦తపురం జిల్లా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం వైకాపాలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో అనంతపురం జిల్లాతో పాటు పార్టీలో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలను మోసం చేసిందని, అందుకే తాను పార్టీని వీడానని తెలిపారు. జిల్లాలో పార్టీ గెలుపుకు శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలుగుదేశం తరపున లోక్ సభ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అక్కడ రసవత్తర పోటీ జరిగే అవకాశం ఉంది. ఇరు పక్షాలకు ఇది ప్రతిష్టాత్మక నియోజకవర్గం అవుతుంది.