గన్నవరంలో మళ్లీ టికెట్ ఫైటింగ్

 

కృష్ణా జిల్లా గన్నవరం అంటే ప్రతిసారీ హాట్ సీటే. ఆ టికెట్ కోసం ఏ ఎన్నికల్లో చూసినా ఎంతోకొంత గొడవలు తప్పవు. ఇప్పుడు కూడా గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ల పోరాటం టీడీపీలో కల్లోలాన్ని రేపుతోంది. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్‌ పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకే గన్నవరం సీటు కేటాయించాలని ఇద్దరు నాయకులూ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల ద్వారా వారు అసెంబ్లీ టిక్కెట్టు కోసం పోరాటం చేస్తున్నారు. గత మూడు మాసాలుగా వారిద్దరూ పార్టీ టిక్కెట్టు తనదంటే, తనదని ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పంపించారని, ఈసారి గన్నవరం నుంచి అవకాశం ఇవ్వాలని తాను చంద్రబాబును అడిగినట్లు వంశీ అంటున్నారు. నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పారంటూ వంశీ పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. అయితే, వంశీ చెప్పేదంతా అభూత కల్పనగా సిట్టింగ్ ఎమ్యెల్యే దాసరి వెంకట బాలవర్థనరావు కొట్టిపారేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరకీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నిజాయితీగల నాయకునిగా తనకు పార్టీలో ప్రజల్లో గుర్తింపు ఉందన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ తనకే గన్నవరం సీటు కేటాయిస్తారని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో పార్టీ టిక్కెట్టు ఎవరికి దక్కుతుందనే విషయం చర్చనీయాంశమైంది.