ఏపీ అసెంబ్లీలో వివాదాస్పదంగా వంశీ తీరు... వైసీపీకి వంశీ స్లిప్స్

ఏపీ అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. టీడీపీతో విభేదించిన వంశీ ...తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ ను కోరారు. వంశీ వినతి మేరకు ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సీటు కేటాయించారు. అయితే, ఇతరులకు కేటాయించిన సీట్లలో ఎక్కడైనా కూర్చోవచ్చని స్పీకర్ చెప్పడంతో... నాలుగో రోజు టీడీపీ సభ్యులు కూర్చునే మొదటి వరుసలోనే  కూర్చున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పక్క సీట్లో కూర్చున్న వల్లభనేని వంశీ... వైసీపీ ఎమ్మెల్యే అంబటికి స్లిప్స్ పంపిస్తూ వివాదాస్పదంగా వ్యవహరించారు. 2430 జీవో, మీడియాపై ఆంక్షలు విధించారంటూ తెలుగుదేశం ఆందోళన చేస్తున్న సమయంలో వంశీ... అంబటికి స్లిప్స్ పంపించడం చర్చనీయాంశమైంది. అయితే, టీడీపీ సభ్యుల పక్కనే కూర్చుంటూ పక్కలో బల్లెంలా వ్యవహరిస్తోన్న వంశీ తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.