ఉత్తమ్ కుమార్ రెడ్డి... విమానం టెన్షన్...

 

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వుండే ఢిల్లీలో పావులు కదిపిన ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగానీ, పీసీసీ అధ్యక్షులుగానీ కాలికి బలపం కట్టుకుని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది మామూలు విషయమే కదా... అందుకే సహజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ‘అమ్మ’ సోనియాగాంధీకి థాంక్స్ చెప్పుకోవడానికి సతీ సమేతంగా ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానాన్ని ఎక్కారు. ఈ విమానం గాల్లో వుండగా, వాతావరణం అనుకూలించలేదు. దాంతో ఢిల్లీ వెళ్ళాల్సిన విమానాన్ని దారి మళ్ళించి లక్నోలో దించారు. వాతావరణం మామూలుగా అయిన తర్వాత ఆ విమానం మళ్ళీ ఢిల్లీ వెళ్ళిందనుకోండీ... కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మను దర్శించుకోవడం కొంచెం లేటయింది అంతే.