కొండచరియ దుర్ఘటన: రాజ్నాథ్ పరామర్శ
posted on Jul 31, 2014 10:56AM
పూణె సమీపంలో కొండ చరియ విరిగిపడిన సంఘటనలో ఇప్పటి వరకు 25 మంది మరణించిన విషయం తెలిసిందే. శిథిలాల కింద మరో 100 మంది వున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంఘటన స్థలాన్ని గురువారం ఉదయం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలోని మలిన్ గ్రామంలో కొండ చరియ విరిగిపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. కుండపోత వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయం కావడంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు జాతీయ విపత్తు సహాయక దళం సభ్యులు 15 మందిని కాపాడారు. మొత్తం 44 ఇళ్లకు సంబంధించిన వారు శిథిలాల కింద చిక్కుకుని వున్నారు. కొండ చరియ శిథిలాలు, మట్టి కింద 100 మంది కూరుకుపోయి 24 గంటలు దాటిపోవడంతో మట్టి, బురద కింద చిక్కుకున్నవారు జీవించి లేరేమోనన్న భయం కలుగుతోంది.