తంతే ఎక్కడ పడతావో చూస్కో.. రేవంత్ పై సుమన్ ఫైర్

నల్గొండ జిల్లా  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార గడువు సమీపిస్తున్న కొద్ది నేతల మాటల్లో తీవ్రత పెరుగుతోంది. వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మంట రాజేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రేవంత్ రెడ్డి కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డాడని, ఇప్పుడు అక్కడ తంతే ఇంకెక్కడ పడతాడో చూసుకోవాలని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ కు పదవులు ఓ లెక్క కాదని, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావ్? అంటూ రేవంత్ పై మండిపడ్డారు. పెద్దవూరలో మీడియాలో మాట్లాడిన బాల్క సుమన్... కొడంగల్ లో ఘోర పరాజయం పాలైనప్పటికీ రేవంత్ కు సిగ్గు రాలేదని విమర్శించారు.  ఆంధ్రా పాలకుల తొత్తుగా పనిచేసిన రేవంత్ కు టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తే హక్కులేదన్నారు.

పెద్దల గురించి అవాకులు చెవాకులు పేలుతూ   రేవంత్ రెడ్డి శునకానందం అనుభవిస్తున్నారని సుమన్ అన్నారు. రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, చిప్పకూడు తినడం తథ్యమని చెప్పారు. గతంలో పెయింటర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు. మైకు దొరికితే చాలు కుక్కలాగా మొరుగుతుంటాడని విమర్శించారు. 'నేనొక్క పిలుపు నిస్తే కార్యకర్తలు, అభిమానులు నీ సంగతేంటో చూస్తారు' అని సుమన్ హెచ్చరించారు.

పెద్దవూర మండల కాంగ్రెస్ ప్రచార ఇంచార్జ్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. కరోనాతో రెండు వారాల పాటు ఇంట్లోనే ఉన్న రేవంత్ రెడ్డి.. శుక్రవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దవూర మండంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి.