కలెక్టర్‌ను టచ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు..హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ ప్రీతి చేయిపట్టుకోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే విషయాన్ని మంత్రి చందూలాల్‌కు వివరించినా ఆయన స్పందించలేదు.

 

దీంతో ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు, రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గత కొంతకాలంగా తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు..దీంతో విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా వెళ్లడంతో ఆయన వెంటనే శంకర్‌నాయక్‌కు ఫోన్ చేసి తీవ్రంగా మందలించారు. కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఇంటికి వెళ్లిన శంకర్‌నాయక్ ఆమెకు క్షమాపణలు చెప్పారు..అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ మీనా తనకు సోదరితో సమానమని..అనుకోకుండా చేయి తగిలి ఉండొచ్చంటూ వివరణ ఇచ్చారు..అంతకు ముందు కలెక్టర్ ఫిర్యాదుపై పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు..అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.