ప్రచారంలో అపశృతి..టీఆర్ఎస్ నేత మృతి

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలనేతలు ప్రచారం ముమ్మరం చేశారు.అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారాల్లో ముందుంది.ఆ పార్టీ అభ్యర్థులు,ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.అయితే కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది.టీఆర్ఎస్ నేత ప్రచార అనంతరం కార్యకర్తలతో భోజనం చేస్తూ తుది శ్వాస విడిచాడు.జీడిమెట్ల డివిజన్‌లో ఆదివారం ప్రచారం నిర్వహించిన కార్యకర్తలకు రుక్మిణి ఎస్టేట్‌లో భోజన ఏర్పాట్లు చేశారు. వెన్నెలగడ్డకు చెందిన రమేశ్‌(57) నాయకులతోపాటు బస్తీలో తిరుగుతూ ప్రచారం నిర్వహించాడు. కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కార్యకర్తలు అతడిని సమీపంలోగల ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు.గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.మృతుడికి ముగ్గురు కుమారులు.ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్యకర్తలు షాక్ కి గురయ్యారు.