రైలు నుంచి దూకితే...
posted on Mar 3, 2015 10:32AM
నేటి యువతరానికి సాహసం ఎక్కువైపోయింది. వాహనాలు నడిపే విషయంలో మాత్రమే కాకుండా రైలు, బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణం చేసే సమయంలో కూడా అనవసరమైన సాహసాలు చేస్తున్నారు. అయితే చాలా సందర్భాలలో ఆ సాహసం వికటించి ప్రాణాలే పోతున్నాయి. వారి తల్లిదండ్రులకు పుట్టెడు విషాదం మిగులుతోంది. ఇప్పుడు ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. విజయనగరం జిల్లా బాడంగి గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడు విజయవాడలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మంగళవారం నాడు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి బొబ్బిలికి బయల్దేరాడు. రైలు బొబ్బిలి స్టేషన్కి చేరుకోగానే రైలు ఇంకా వేగం తగ్గకముందే ప్లాట్ ఫామ్ మీదకి దూకేశాడు. అయితే వేగాన్ని అదుపు చేసుకోలేకపోవడంతో తల వెళ్ళి ప్లాట్ ఫామ్కి తగిలింది. శరీరమంతా తీవ్రమైన గాయాలు అయ్యాయి. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అనవసరపు సాహసాలు చేసే యువతరానికి మరో గుణపాఠంలా నిలిచాడు.