టీడీపీ నేత తుమ్మలకు అస్వస్థత... ఒత్తిడితోనే...

 

ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుమ్మలను అత్యవసర విభాగంలో వుంచి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆస్పత్రికి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించారు. కాగా, ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించలేకపోయారు. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు ఈమధ్యకాలంలో వినిపించాయి. రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంతలోనే తుమ్మల అనారోగ్యానికి గురయ్యారు.అయితే టీడీపీని వీడాలా వద్దా అన్న సందిగ్ధంలో వున్న తుమ్మల ఆ ఒత్తిడితోనే అనారోగ్యానికి గురయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.