కేరళ హౌస్ లో తెలుగు తల్లి

 

కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో తెలుగు తల్లి ప్రత్యక్షమైంది. తెలుగుతల్లి వేషధారణలో ఉన్న ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ మహిళ ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ. చంద్రబాబు దీక్షతో ఏపీ భవన్ కిక్కిరిసిపోవడంతో పక్కనే ఉన్న కేరళ హౌస్ లో తెలుగు తల్లిలా ముస్తాబైంది. అక్కడి నుంచి నడుచుకుంటూ సభాస్థలి వద్దకు వచ్చింది. ‘నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’ అనే స్లోగన్ ఉన్న ప్లకార్డును పట్టుకుని వేదికపై తెలుగు తల్లి వేషధారణతో యామిని నిరసన తెలుపుతున్నారు. తెలుగు తల్లిని ప్రతిబింబించేలా ఉన్న యామినిని పలువురు టీడీపీ నేతలు ప్రశంసించారు. కాగా చంద్రబాబు దీక్షకు జాతీయ స్థాయి నాయకులు మద్దతు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,జమ్మూ కాశ్మిర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దీక్ష స్థలికి చేరుకొని మద్దతు తెలిపారు.