విశాఖలో రౌడీ దిగాడు.. పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు!

విశాఖకు కొత్త పరిశ్రమలు రావడం లేదు.. గతంలో వచ్చినవి మూత పడుతున్నాయి.. ఏపీకి రావాలంటనే పారిశ్రామిక వేత్తలు వణికిపోతున్నారు.. ఇవి విద్యార్థులతో జరిగిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో విద్యార్థులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి సర్కార్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 

ఒక్క ఛాన్స్ అడిగి సీఎం జగన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తారని  లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచారు. ఇప్పుడు నష్టాలు వచ్చాయి అని చెబుతున్నారన్నారు. పక్కనే ఉన్న జింక్ మూసేసారు ఇప్పుడు కార్మికులు రోడ్డున్న పడ్డారని మండిపడ్డారు. విశాఖలో ఆధాని డేటా సెంటర్ వచ్చి ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు.  విశాఖపట్నానికి రెండేళ్లు ఏం చేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లోకేష్. విశాఖపట్నం రాజధాని అంటున్న జగన్.. రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 

విశాఖలో రౌడీ దిగాడు.. A2 మొత్తం భూములు దోచుకుంటున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. విశాఖకు ఐటీ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కొత్త పరిశ్రమలు రావడం కన్నా ఉన్న పరిశ్రమలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు ఏపీ రావడానికి భయపడుతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కావాలన్నామని.. కానీ దాన్ని  వైసీపీ ప్రభుత్వం వెల్లగొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చాలా బాధగా ఉందన్నారు నారా లోకేష్.  రాష్ట్ర ప్రభుత్వం వైఖరీ ఇలాగే కొనసాగితే వడ్డీ కట్టలేని పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.