నేడే చివరి రోజు...తెదేపా-బీజేపీ పొత్తులకి

 

తెలుగులోకి డబ్బ్ చేసిన తమిళ టీవీ సీరియల్లాగ ఎంతకీ తెగకుండా సాగుతున్న తెదేపా-బీజేపీ పొత్తుల కబుర్లు వినీవినీ బహుశః ప్రజలకే కాదు చంద్రబాబుకి కూడా బోర్ కొట్టేసినట్లుంది. అందుకే నిన్న అర్ధరాత్రి వరకు సాగిన పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం తమ తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయిపోతున్నట్లు ఆయన మీడియాకు లీకులిచ్చేసారు.

 

డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తిట్టుకొంటూ బిజీగా ఉన్న బీజేపీ నేతలు టీవీలలో లీకవుతున్న ఆ వార్తలను చూసి వెంటనే డయల్-యువర్-ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకొని చంద్రబాబుని లైన్లోకి తీసుకువచ్చి ఆయనని తెల్లారే వరకు ఆగమని, అప్పటికి తామే రెక్కలు కట్టుకొని ఆయన ముందు వాలిపోతామని హామీ ఇవ్వడంతో చంద్రబాబు లిస్టు మళ్ళీ జేబులో పెట్టేసుకొన్నారు. కానీ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఆయన జేబులో నుండి పడిపోయిన ఆ లిస్టు తమ చేతిలో చిక్కిందని చెప్పుకొంటూ స్క్రోలింగులో వరుసపెట్టి తెదేపా అభ్యర్ధుల పేర్లను చూపించేస్తున్నాయి. మరి ఇది కూడా మరోకరకమయిన లీకీజి సమస్యా అన్నది ఇంకా తేలవలసి ఉంది.

 

ఇక కమలనాధులు అంతకు ముందు చంద్రబాబుకి మొన్న సాయంత్రం వరకు గడువు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబే వారికి ఈరోజు సాయంత్రం వరకు గడువు పెట్టి ఈ క్లైమక్స్ సీన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈసారయినా సీరియల్ సుఖాంతం అవుతుందని ఆశిస్తూ, ఇంతకాలంగా తెదేపాతో చర్చలు సాగిస్తున్న బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ తో బాటు గ్రూప్ ఫోటో కోసం అరుణ్ జైట్లీ కూడా విమానంలో దిగుతున్నారుట. ఒకవేళ పొత్తులు ఆ రెండు పార్టీల మధ్య కుదిరితే ‘జై రామ్ జీ’కి అనుకొంటూ ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని ఫొటోలకి ఫోజులివ్వచ్చును. లేకుంటే రేపటి నుండి ఆ రెండు పార్టీల నేతల మధ్య రామరావణ యుద్ధం మొదలయిపోతుంది. దానిని బట్టే మిగిలిన పార్టీల సౌండ్ క్వాలిటీ కూడా మారిపోవడం తధ్యం.