శంకరమ్మకు టీడీపీ సపోర్ట్?
posted on Apr 4, 2014 6:13PM
కేసీఆర్ తనకి ప్రాధాన్యం లేని, ఓడిపోయే హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించడంతో ఆగ్రహంగా వున్న శంకరమ్మని టీఆర్ఎస్ నాయకత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పోటీ చేస్తే చెయ్ లేకపోతే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వస్తే, ఆ అమరవీరుల కుటుంబాలనే చిన్నచూపు చూస్తున్న కేసీఆర్ మీద శంకరమ్మతోపాటు అమరవీరుల కుటుంబాల వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు.
శంకరమ్మ ఎంత వద్దని చెప్పినా హుజూర్ నగర్ టిక్కెట్నే ఆమెని కేటాయించడం అన్యాయమని వారు అంటున్నారు. ఇదిలా వుంటే, కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా వున్న శంకరమ్మకి న్యాయం చేయాలని, అమరవీరుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శంకరమ్మకి తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఇవ్వాలని, అది కూడా ప్రస్తుతం తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే వుండగా, తప్పకుండా గెలిచే స్థానాన్ని శంకరమ్మకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే శంకరమ్మ పోటీ చేసే నియోజకవర్గంలో అభ్యర్థిని పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు శంకరమ్మ హుజూర్ నగర్ స్థానాన్ని వ్యతిరేకిస్తూ వుండటంతో ఆమెతో సంప్రదింపులు జరపాలని టీ టీడీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.