జనవరి 1 నుంచి అమరావతిలో హైకోర్టు

 

ఉమ్మడి హైకోర్టు విభజనకు మార్గం సుగమమైంది.ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. జనవరి 1లోగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం డిసెంబర్‌ 15 నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు కోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు న్యాయమూర్తులు కూడా సంతృప్తి చెందారని, జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అతిత్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టు కార్యకలాపాలు కొనసాగిస్తాయని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.అమరావతిలో జస్టిస్‌ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తిస్థాయిలో జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.