ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్ వచ్చింది

 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ హై కోర్టు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 106 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఎట్టకేలకు విడుదల కానున్నారు. 2 లక్షల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని మీడియాతో మాట్లాడవద్దని జస్టిస్ ఆర్.భానుమతితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆర్థిక నేరాలు తీవ్రమైనవి అయినప్పటికీ కూడా ప్రతి కేసునూ విడివిడిగా చూడాలన్న ధర్మాసనం చిదంబరానికి బెయిలు మంజూరు చేసింది. 

కస్టడీలో ఉన్న సమయంలో కూడా చిదంబరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. మనీలాండరింగ్ లాంటి ఆర్థిక నేరాలు ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో చిదంబరానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం లేదని కపిల్ సిబాల్ తో పాటు అభిషేక్ మను సింగ్ వాదించారు. 

ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఆగస్టు 21 న సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసింది. సీబీఐ పెట్టిన కేసులో బెయిల్ మంజూరైన అప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చిదంబరం చుట్టూ ఉచ్చు బిగించడంతో జైలుకే పరిమితం అయ్యారు. 2007 లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలోకి 305 కోట్ల రూపాయల విదేశీ నిధులను తరలించడంలో ఆర్థిక మంత్రి హోదాలో క్విడ్ ప్రోకు పాల్పడ్డారఅన్నది చిదంబరం పై వున్న అభియోగం. తండ్రికి బెయిల్ లభించడంతో కార్తీ చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. 106 రోజుల తర్వాత బెయిల్ వచ్చిందంటూ ట్వీట్ చేశారు.