సమ్మె ఆగదు.. ఉద్యోగాల్లో తిరిగి చేరేది లేదు.. :- ఆర్టీసీ జేఏసీ 

 

సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుండా విధుల్లోకి వచ్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. ఉద్యోగాలు తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని.. అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తేనే మీరు చెప్పినట్లు యూనియన్లు రద్దు చేసుకుంటామన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలచి.. లేబర్ యాక్ట్ ప్రకారం చర్చలు జరిపితే మంచిదన్నారు. కేసీఆర్  ఇచ్చే వార్నింగ్ లకు భయపడి కార్మికులెవరూ తిరిగి విధుల్లో చేరే ఆలోచనకు రావొద్దని అశ్వత్థామరెడ్డి కోరారు.

పోరాటం మొదలు పెట్టాం..ధైర్యంగా ముందు వెళదామని.. ఆత్మద్రోహం చేసుకుని విధుల్లోకి చేర వలసిన అవసరం లేదని చెప్పారు. నిరుద్యోగుల విజ్ఞప్తితో నవంబర్ 5న చేయాలనుకున్న సడక్ బంద్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలతో సమాణికులని చెప్పినందుకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు జేఏసీ నేతలు. నవంబర్ 5 అర్థరాత్రి లోగా ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా 5వేల బస్సులు ప్రైవేట్ కు ఇస్తే.. చివరకు 5వేల బస్సులు మాత్రమే మిగులుతాయని జోస్యం చెప్పారు.కేసీఆర్ చెప్పిన విధంగా చూస్తే 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరం అవుతారని.. మిగతా 23వేల మంది కార్మికులను ఏం చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశ్వత్థామరెడ్డి.

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వం కోరినట్లు యూనియన్లను వైండప్ చేస్తామని తెలియజేసారు. కార్మికులను భయపెట్టేలా సీఎం మాట్లాడారని జేఏసీ నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆదివారం(నవంబర్ 3,2019) టీఎంయూ కార్యాలయంలో సమావేశం అయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్  చేసిన కామెంట్స్ పై చర్చించారు. కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. నవంబర్ 4 నుండి డిపో మేనేజర్లు సమ్మెకు మద్దతివ్వాలని జేఏసీ నేతలు కోరారు.