చంద్రబాబుపై రాళ్ల దాడి!

తిరుపతి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో రాళ్ల దాడి జరిగింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభ నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్య అని.. పోలీసుల వైఫల్యమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. నిరసన వద్దని చంద్రబాబును పోలీసులు కోరారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. రౌడీయిజం నశించాలంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. తనకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనకు రక్షణ  కల్పించలేరా అని చంద్రబాబు మండిపడ్డారు. ఇక రాయి దాడి ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.