సిక్కోలులో శిథిల హస్తం

 

శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఏకంగా మూడు చోట్ల అత్యధిక వార్డుల్లో నామినేషన్లు వేయలేని దుస్థితిలో పడిపోయింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 91 వార్డులుండగా, వాటిలోని 31 వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. ఇచ్ఛాపురంలో 6 వార్డుల్లోను, పలాస-కాశీబుగ్గలో 9చోట్ల, ఆమదాలవలసలో మూడు వార్డుల్లోను, పాలకొండ నగర పంచాయతీలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. వీటిలో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోవే. గతంలో ఇదే కాంగ్రెస్ తరపున వార్డు స్థానాల కోసం పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో వివాదాలు, గొడవలు జరిగాయి. టికెట్ల కోసం దాదాపు కొట్టుకున్నారు.