ఏపీకి జపాన్ ఇసుజు ట్రక్కుల ఇండస్ట్రీ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం తన జపాన్ పర్యటనలో భాగంగా నాలుగోరోజు ఇసుజు, మయేవక సంస్థల ప్రతినిధులతో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో పికప్ ట్రక్స్ తయారీ సంస్థను పెట్టడానికి సిద్ధంగా వున్నట్టు ప్రముఖ ఆటోమోబైల్ సంస్థ ఇసుజు ప్రతినిధులు స్పష్టం చేశారు. తమకు 10 ట్రక్ తయారీ సంస్థలు వున్నాయని, మరో ట్రక్ తయారీ సంస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ అన్నివిధాలా అనుకూలమైందని ఇసుజు సంస్థ ఉపాధ్యక్షుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమ సంస్థతోపాటు పలు జపాన్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

 

ఇసుజు సంస్థ తమ పరిశ్రమను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్‌ని ఎంచుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుఫాను సమయంలో ఇసుజు సంస్థ తన వాహనాలు ఇచ్చి ఆదుకుందని చెప్పారు. అదేవిధంగా జపాన్‌లోని ప్రసిద్ధ మయేవక కంపెనీ ఛైర్మన్‌తో చంద్రబాబు నాయుడు బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఏపీలోని ఫుడ్ పార్కుల్లో కోల్డ్ చైన్ సిస్టమ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మయేవక సంస్థ ఛైర్మన్ తెలిపారు. రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ల పరిశ్రమను కూడా ఏపీలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘జపాన్‌కి, ఆంధ్రప్రదేశ్‌కి చాలా అంశాల్లో చాలా దగ్గర పోలికలున్నాయి. మాదేశం నుంచి మీరు బుద్ధిజాన్ని స్వీకరించారు. మీ నుంచి మేం సంస్కృతి, కష్టించి పనిచేసే తత్వాలను నేర్చుకున్నాం. బుద్ధిజం పర్యాటకాన్ని శ్రీకాకుళం, అమరావతిల్లో అభివృద్ధి చేస్తాం. జపనీస్ భాషను మా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడతాం’’ అన్నారు.