ఏపీలో వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు కష్టమే?

 

ఏపీ రవాణాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పరిక్రియకు శ్రీకారం చుట్టింది.వాహనాల రిజిస్ట్రేషన్‌లో జిల్లాల కోడ్‌లను ఎత్తేసింది. రాష్ట్రమంతా ఒకే కోడ్‌ అమల్లోకి తీసుకొచ్చింది.ఏ జిల్లాలో వాహనం రిజిస్టర్‌ అయినా దానికి ‘ఏపీ 39’ కోడ్‌నే కేటాయిస్తుంది.ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఏపీ 01 నుంచి ఏపీ 38 వరకూ ఆర్టీఏ కోడ్‌ నంబర్లు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జిల్లాలన్నీ ‘టీఎస్‌’ రిజిస్ట్రేషన్‌కు మారిపోయాయి.కానీ ఏపీలో ఉన్నఆర్టీఏ కార్యాలయాల ఆధారంగా అనంతపురం-01 నుంచి మొదలుపెట్టి పశ్చిమ గోదావరికి చివరి నంబరు కేటాయిస్తారని ప్రచారం జరిగింది.అయితే రాష్ట్రమంతా ఒకే కోడ్‌ ఇవ్వాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీనిప్రకారం ఇకపై జిల్లా ఏదైనా రిజిస్ట్రేషన్‌ నంబర్లు మాత్రం ‘ఏపీ39’ నుంచే మొదలవుతాయి.ఇప్పటివరకూ పోలీసు వాహనాలకు మాత్రమే కేటాయిస్తున్న ‘పీ’ సిరీస్ ను ఇకపైనా అలాగే కొనసాగిస్తారు. టీ, యూ, వీ డబ్ల్యూ, ఎక్స్‌, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు, ‘జెడ్‌’ సిరీస్ ను ఏపీఎస్ఆర్టీసీకి కేటాయిస్తారు. ‘ఓ’ అక్షరం సున్నాలా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కేటాయించే అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత సిరీస్‌ ముగిసిన తర్వాత కోడ్‌ను ఏపీ39 నుంచి ఏపీ40కి మారుస్తారు.

ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ తో ఫ్యాన్సీ నెంబర్లు ఆశించేవారు ఇబ్బంది ఎదుర్కోక తప్పదు.గతంలో జిల్లాకో కోడ్ ఉండటం వల్ల ఎదో ఒక సిరీస్ లో ఫాన్సీ నెంబర్ ను అతి సులభంగా పొందేవారు.కానీ ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే కోడ్ అవ్వటం వల్ల ఇక ఫ్యాన్సీ నెంబర్ కావలి అంటే ఆన్‌లైన్‌ ద్వారా బిడ్డింగ్‌కు వెళ్లాల్సిందే.దీనివల్ల ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పెరగటమే కాకుండా రవాణాశాఖకు ఆదాయం కూడా పెరుగుతుంది.