చంద్రబాబు డబ్బుతో శివాజీ ఆస్తుల కొనుగోలు

 

ఆపరేషన్ గరుడ తో వార్తల్లో నిలిచిన సినీ హీరో శివాజీ ..గత కొంత కాలంగా మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆయన ఎంత జాగ్రత్తపడ్డా మీడియా నుంచి తప్పించుకోలేకపోయారు. తాజాగా ఆయన కృష్ణా జిల్లా గన్నవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. గన్నవరం మండలం చిన్నఆవుటపల్లి పరిధిలో ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన అపార్టుమెంట్‌లో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ నిమిత్తం శివాజీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించారు.


శివాజీ రాకపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. కాగా మీడియా ప్రతినిధులపై శివాజీ రుసరుసలాడారు. ఫొటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ‘రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు... అంతేగా..’ అంటూ కస్సుబుస్సులాడారు. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా వారిని శివాజీ వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఫోటోలు తీసిన వారి దగ్గర నుంచి దౌర్జన్యంగా ఫోన్‌లను తీసుకొని ఫొటోలను తొలగించారు. రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే శివాజీ పరుగు పరుగున కారు ఎక్కేసి వెళ్లిపోయారు.