పాపం శంకర్రావు!

 

 

 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకి తనకు మళ్ళీ టిక్కెట్ దక్కదేమోనన్న భయం పట్టుకుంది. సోనియాగాంధీకి గుడికట్టినప్పటికీ శంకర్రావుకి ఈసారి టిక్కెట్ రావడం అనుమానమేనన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో శంకర్రావు దిగులు పెట్టేసుకున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం వెన్నతో పెట్టిన విద్య అయిన శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమైపోయారు. ఈమధ్యకాలంలో తాను చేసిన తప్పులు గుర్తొచ్చి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు.


తెలంగాణ తల్లి అంటే వేరే ఎవరో కాదు. సాక్షాత్ సోనియాగాంధీయే అని ప్రకటించేశారు. చివరికి సోనియాగాంధీకి గుడి కూడా కట్టేశారు. అలాంటి శంకర్రావు ఇప్పుడు తనకు టిక్కట్ రాదని బెంగపడిపోతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ, తన స్థానంలో తన కుమార్తెకి అయినా టిక్కెట్ ఇవ్వాల్సిందిగా  వినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పాపం శంకర్రావు.