సమ్మెకు సర్వం సిద్దం
posted on Aug 6, 2013 6:19PM
రాష్ట్రంలో మరో సారి సమ్మెసైరన్ మోగింది, గతంలో సకల జరనుల సమ్మెతో కుదేలయిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మరోసారి అదే ఉపద్రవాన్ని ఎదుర్కొనబోతుంది. సీమాంద్ర పై ఎటూ తేల్చకుండానే తెలంగాణ ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇక మూల్యం చెల్లించక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సమైక్యాంద్రకు మద్దతుగా ఈ నెల12 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్టుగా ఏపి ఎన్జీవోలు హెచ్చరించారు. అందుకు సంబందిచిన సమ్మె నోటిసును ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శికి అందచేశారు ఏపి ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ సమ్మెకు దిగుతున్నట్టుగా అశోఖ్ బాబు వెల్లడించారు.
రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారవుతుంది, విద్యా ఉపాది అవకాశాలు దెబ్బతింటాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పై తెలంగాణ ప్రాంత వాసులతో పాటు సీమాంద్ర వాసులకు కూడా సమాన హక్కులు ఉంటాయిని, తమ ప్రాంత ప్రజల మనోభావాలనుతెలుసుకోకుండా ఏక పక్షంగా విభజన చేయటం సరికాదు అన్నారు. ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్సులను నిలిపివేస్తామని ఎన్ఎంయూ, ఈయులు మద్దతు తెలిపాయి.