ఒకే వేదిక మీద సచిన్, పవన్?

 

టాలీవుడ్ మూవీ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంటర్నేషన్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం నాడు విజయవాడలో ఒకే వేదిక మీద కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం నాడు వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పొట్లూరి వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడు. ఈమధ్య ముగిసిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి వరప్రసాద్‌కి టీడీపీ టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అది మిస్సయింది. అయినప్పటికీ పొట్లూరి వరప్రసాద్, పవన్ కళ్యాణ్ మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్‌తోపాటు పవన్ కళ్యాణ్‌ని కూడా పొట్లూరి వరప్రసాద్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్స్‌ని ఒకే వేదిక మీద చూస్తే ఇటు క్రికెట్ అభిమానులతోపాటు అటు సినిమా అభిమానులకు కూడా పండగే. సచిన్, పవన్ ఒకరినొకరు కలవటం ఇదే మొదటిసారి కాబోదు.. గతంలో చిరంజీవి కుటుంబాన్ని సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు కలిశారు.