జగన్ అక్రమాస్తుల కేసు... సీబీఐ కోర్టుకి రాజకీయ ప్రముఖులు
posted on Jan 17, 2020 10:22AM
హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం కోర్టుకు ఏ2 నిందితుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. సీబీఐ కోర్టుకు గత శుక్రవారం జగన్ హాజరైన విషయం తెలిసిందే. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ వేశారు. అలాగే ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలని కూడా గత వారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. నేటికి విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి పలువురు ప్రముఖులు ఈరోజు కోర్టుకి హాజరయ్యారు. మరి సీబీఐ కోర్టు ఏం చెప్పనుంది? జగన్కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.