'కేజీఎఫ్' హీరో హత్యకు కుట్ర.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు!

'కేజీఎఫ్' మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న కన్నడ స్టార్ యశ్ హత్యకు కుట్ర చేసిన స్లమ్ భరత్ అనే మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. భరత్ పై ఓ మర్డర్ కేసు సహా 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదిగా యశ్ ను హత్య చేసేందుకు భరత్ ప్లాన్ చేస్తుండగా, అతను ప్లాన్ ను అమలు చేయకముందే పోలీసులు దాన్ని భగ్నం చేశారు. భరత్ ని గత సంవత్సరం యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు, కర్ణాటకకు తీసుకువచ్చారు. కాగా, ఓ కేసుకి సంబంధించి సీన్ రీ కన్ స్ట్రక్షన్ నిమిత్తం తాజాగా అతన్ని బయటకు తీసుకెళ్లగా, పోలీసులపై అతను దాడికి దిగాడని, దీంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి  జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత సంవత్సరం భరత్ తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భరత్.. యశ్ హత్యకు కుట్ర పన్నినట్టు తెలిపాడు. ఈ వార్త కలకలం రేపింది. ఈ వార్తలపై అప్పట్లో యశ్ కూడా స్పందించాడు. ఇలాంటి వార్తలు తనను బాధిస్తున్నాయని, తనపై ఎటువంటి కుట్రలూ జరుగడం లేదని అప్పట్లో యశ్ మీడియాకు వెల్లడించాడు. తనకు ఎలాంటి థ్రెట్స్ లేవని, ఈ విషయమై హోమ్ మంత్రితో పాటు, డీజీపీతో మాట్లాడానని అన్నారు. యశ్ అప్పుడు ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఇప్పుడు, అదే క్రిమినల్ ఎన్ కౌంటర్ లో హతం అవడం చర్చనీయాంశమైంది.