తాగుబోతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి

 

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రోడ్‌ షోలో మాజీ మంత్రి సునితారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..నర్సాపూర్‌ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్‌ ఏ సమస్యలను తీర్చలేదని ఆరోపించారు. ఆయనకు ఏ సమస్యలు పట్టవని, ఫామ్‌ హౌజ్‌లో కూర్చొని తాగడం ఒక్కటే తెలుసని ఎద్దేవా చేశారు.తాగుబోతుల చేతుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు.మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతానని కేసీఆర్ పంగ నామాలు పెట్టారంటూ మండిపడ్డారు. ఏ హామీ నెరవేర్చని కేసీఆర్ ఓట్లు అడిగే అర్హత లేని సన్నాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి ఐదుగురు మహిళలను మంత్రులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని... కానీ, కేసీఆర్ చేసింది ఏమిటని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో కేసీఆర్ తో మాట్లాడే దమ్ము ఏ మంత్రికీ లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగం ఏంటి? అని ప్రశ్నించిన రేవంత్... తెలంగాణ దినోత్సవం రోజు కేసీఆర్ ఎప్పుడైనా అమరుల కుటుంబాలను శాలువాతో సన్మానించారా? ఉద్యమ కారులకు గౌరవం లేదు. అమరులకు గుర్తింపు లేదు అంటూ విమర్శలు గుప్పించారు.

కేసీఆర్‌ దగ్గర గూలాం గిరి చేసే మదన్‌ రెడ్డి కావాలో.. అసెంబ్లీలో నర్సాపూర్‌ సమస్యల కోసం కొట్లాడే సునీతా రెడ్డి కావాలో ఆలోచించడంటూ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కర్రు కాల్చి కారు గుర్తుకు వాత పెట్టాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ప్రజాశీర్వాదంతో నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం సునీతా రెడ్డి మాట్లాడుతూ..బంగారు తెలగాంణలో మెడలో పుస్తెల తాడు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. జనం చచ్చారో, బతికారో పట్టించుకోని కేసీఆర్‌కు ఓటు వేయవద్దు అంటూ కాంగ్రెస్‌  విజ్ఞప్తి చేశారు. తన భర్త మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నాను.. కానీ ప్రజల కోసం తిరిగి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఆలోచన కాంగ్రెస్‌ హయాంలోదేనని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ర్యాలీ విజయోత్సవ ర్యాలీగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మెడలో పుస్తెలు అమ్ముకోవాల్సి వచ్చిందన ఆరోపించారు. నర్సాపూర్‌ పౌరుషాల పోరుగ్డడ అని గుర్తు చేశారు.