ఆశల పల్లకిలో కేసీఆర్!

అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.   లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు.  ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
Publish Date: Apr 19, 2024 3:43PM

రేవంత్ దూకుడు.. 14లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్!

 తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది.  నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా  ప్ర‌క‌టించాల్సి ఉంది. ముఖ్యంగా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. అందుకు త‌గ్గట్లుగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కాలేదు. అయితే హామీల అమలు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి కారణంగా   ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్  గ్రాఫ్ పెరిగింది. మూడు నెల‌ల కాలంలో ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించామ‌ని, ఎన్నిక‌ల కోడ్ తొల‌గించిన వెంట‌నే మిగిలిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా వారి నుంచి మ‌రింత మ‌ద్ద‌తు పొందేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీక‌రించింది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే  ప్రపకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.   మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈనెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ర్యాలీ, సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గోనున్న రేవంత్‌.. 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొంటారు. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీలో పాల్గొని అనంత‌రం జ‌రిగే సభలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తారు. ఇలా మే 11వ తేదీ వ‌ర‌కు  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేయ‌నున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి పార్టీలో చేరిక‌ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. రెండు రోజుల్లో ఆయ‌న‌సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్‌లో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు కొంద‌రు కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నుంచి ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతుండ‌టంతో పార్టీ బ‌లం రోజురోజుకు పెరుగుతున్నది.   దీంతో రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాల్లో 14  నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ మూడు నెల‌ల పాల‌నకు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెఫ‌రెండమ్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీది గాలివాటం గెలుపేన‌ని నిరూపించేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు బీజేపీ అధిష్టానంసైతం కాంగ్రెస్ కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు రేవంత్ రెడ్డి మూడు నెల‌ల పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను అమలు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డానికే అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని మాజీ సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌తామ‌ని అన్నారు. అయితే,  బీజేపీ, బీఆర్ ఎస్   నేత‌ల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడ్డి  ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం ఇస్తూ తిప్పికొడుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. రాబోయే కాలంలో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండ‌గా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ను రేవంత్ ఏమేర‌కు రీచ్ అవుతాడ‌నే అంశం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
Publish Date: Apr 19, 2024 2:59PM

రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ.. త్వరలో కాంగ్రెస్ గూటికి!?

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆయన కేవలం మర్యాదపూర్వకంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డిని కలవలేదు. తాను తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుతామని చెప్పడానికే రేవంత్ రెడ్డిని కలిశారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. ఇలా ఉండగా గత కొంత కాలంగా ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత లోక్ సభ ఎన్నికల తరువాత రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయనీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉందనీ, ఇప్పటికే 20 మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారనీ చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లడం విశేషం. వసలను నిరోధించడానికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారని ప్రకాష్ గౌడ్ ఉదంతంతో తేటతెల్లమైంది. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతిక మంది  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారనీ, వీరంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద సిట్టింగులను కాపాడుకోవడంలో, వలసలను నివారించడంలో బీఆర్ఎస్ అధినాయకత్వొం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 19, 2024 12:14PM

ఉత్తరాదిలో కానరాని బీజేపీ హవా.. ఆర్ఎస్ఎస్ చెబుతున్నది నిజమేనా?

సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే  కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.  అలాగే ప్రముఖ రాజకీయ, ఆర్థిక వేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ కూడా ఉత్తరాదిలో బీజేపీ గ్రాఫ్ డౌనైందంటున్నారు.   దేశంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ఆయన వివరిస్తున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ 400 స్థానాలు అని గొప్పలు చెప్పుకుంటోందనీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే ఆ పార్టీ కనీసం 200 స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేననీ చెబుతున్నారు.  ఆర్ఎస్ఎస్ వినా బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్న అభిప్రాయాలన్నీ  రాజకీయ వైరంతో చెబుతున్న మాటలు, జోశ్యాలుగా కొట్టి పారేసినా బీజేపీ మెంటార్ రాష్ట్రీయస్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ఆలోచించాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో   ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ రెండోందలకు మించి స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదని తేలింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.  ఆర్ఎస్ఎస్ అంచనా ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గణనీయంగా సీట్లను నష్టపోతున్నది. ఆర్ఎస్ఎస్ చెబుతున్న దానిని బట్టి చూస్తే బీజేపీ సొంతంగా 178 స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది.  అంటే క నీసం 300 స్థానాల సొంతంగా విజయం అన్న బీజేపీ లక్ష్యం నెరవేరే చాన్సే లేదు.   వాస్తవానికి గత కొన్ని నెలలుగా పరిశీలకులు వైసీపీకి ఉత్తరాదిలో ఆదరణ తగ్గుతోందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఆక్కడ తగ్గే స్థానాలను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. అయితే దక్షిణాదిలో ఒక్క కర్నాటక వినా ఆ పార్టీకి పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. నిన్న మొన్నటి వరకూ అక్కర్లేదు మేమే చాలు అంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను దూరం చేసుకున్న కమలనాథులు ఇప్పుడు చిన్నా చితకా పార్టీలను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ.. మరో సారి అధికారంలోకి వస్తే కచ్చితంగా మిత్రధర్మాన్ని పాటించి భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తామని నమ్మకంగా చెబుతున్నారు.   ఉత్తరాదిలో బలమైన   రాజపుట్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేందుకు కారణమైందని అంటున్నారు.   బీజేపీ ప్రముఖుడు ఇటీవల రాజ్‌పుట్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ ప్రభావం ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపడానికి కారణమయ్యాయి.    ఇక ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కూడా, బీజేపీకి మైనస్ అయ్యిందన్నది పరిశీలకుల విశ్లేషణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఇటీవల వెల్లడించిన  వివరాలలో  ఈడీ-సీబీఐ కేసులకు గురైన కంపెనీలన్నీ తర్వాత, బీజేపీకి భారీ మొత్తంలో  ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చాయతేలడం బీజేపీకి భారీ నష్టం చేకుర్చనుందని అంటున్నారు. ఏయే కంపెనీ బీజేపీకి ఎంతెంత విరాళాలు ఇచ్చిందన్న వివరాలు గత కొద్దిరోజు నుంచి మీడియాలో శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. అది సహజంగానే బీజేపీకి కొంత నష్టం కలిగి ఉండవచ్చంటున్నారు. 
Publish Date: Apr 19, 2024 11:54AM

కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. వైసీపీకి ఇక దబిడి దిబిడే!

ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు. దీంతో ఈసీ కొర‌డా ఝుళిపించింది. వైసీపీతో అంట‌కాగుతూ.. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డిపై ఈసీ వేటు వేసింది. మ‌రోవైపు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడి హోదాలో ఉండి ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి సైతం ఈసీ షాకిచ్చింది. మంత్రుల‌తో స‌మానంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వ‌ర్తిస్తుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి  ముకేశ్ కుమార్ మీనా ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారుల‌కు స‌మాచారం చేర‌వేయాల‌ని పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు ఎల‌క్ష‌న్ నియ‌మావ‌ళితో సంబంధం లేకుండా విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల నోటికి తాళం ప‌డిన‌ట్ల‌యింది. మ‌రోవైపు  వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సీఎస్, డీజీపీల‌ను ప‌క్క‌న‌పెట్టేందుకు ఈసీ అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌ల‌తో సీఎస్‌, డీజీపీల‌పై చ‌ర్య‌లు ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా స్ప‌ష్టం చేశారు. దీంతో ఎన్నిక‌ల వేళ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వైసీపీ మ‌ద్ద‌తుదారుల‌కు ఈసీ షాకివ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  ఎన్నిక‌ల కోడ్ స‌మ‌యంలోనూ కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో డీజీపీ స్థాయినుంచి వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కింది స్థాయి అధికారుల‌పై ఎన్నిక‌ల సంఘానికి కూట‌మి నేత‌లు ఆధారాల‌తో స‌హా ఫిర్యాదులు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిపై ఈసీ కొర‌డా ఝుళిపిస్తుంది. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాచ‌రిక పాల‌న‌ను కొన‌సాగించారు. ఐదేళ్ల‌లో జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల నుంచి ఎదురువుతున్న నిర‌స‌న‌ల‌తో జ‌గ‌న్‌, వైసీపీ అభ్య‌ర్థులు బెంబేలెత్తిపోతున్నారు. జ‌గ‌న్ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర‌కుసైతం ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లో మ‌రోసారి సానుభూతి పొందేందుకు రాయిదాడి ఘ‌ట‌న‌ను జ‌గ‌న్‌ తెర‌పైకి తెచ్చార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. రాయిదాడి ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసి ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందాల‌ని చూసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. దీంతో పోలీసులు స‌హాయంతో రాయిదాడి ఘ‌ట‌న‌ను  తెలుగుదేశం నేత‌ల‌పై నెట్టేందుకు వైసీపీ పెద్ద‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో ఇదే త‌ర‌హాలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కోడి క‌త్తి, వివేకానంద రెడ్డిల హ‌త్య ఘ‌ట‌న‌ల‌ను తెలుగుదేశంపై నెట్టి ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డం ద్వారా వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈసారికూడా అదే త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేసిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై  ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికితోడు ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైసీపీ నేత‌ల‌పై ఈసీ కొర‌డా ఝుళిపిస్తున్నది.   రాష్ట్ర స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న‌న్ని రోజులు వైసీపీ కార్య‌క‌ర్త‌గానే వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తిప‌క్షాల‌పై ఉద్యోగుల‌ను రెచ్చ‌గొట్ట‌డం, ప్ర‌భుత్వ ఉద్యోగి హోదాలో ఉండి రాజ‌కీయ పార్టీల నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. అయితే, ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన స‌మ‌యంలోనూ ఆయ‌న తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ప్ర‌భుత్వ ఉద్యోగిని అనే విష‌యం మ‌రిచి కార్య‌క‌ర్త‌లా మారి వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేయాల‌ని ప్ర‌చారం సైతం చేశాడు. గ‌త నెల 31న ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేలు, మైద‌కూరు, ప్రొద్దుటూరు, క‌డ‌ప ఆర్టీసీ డీపోల్లో ప్ర‌జా రావాణా శాఖ (పీటీడీ) వైఎస్ ఆర్ జిల్లా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు చ‌ల్లా చంద్ర‌య్య‌, మ‌రికొంద‌రితో క‌లిసి వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేయాల‌ని  క‌ర‌ప‌త్రాలు పంచారు. ఈ దృశ్యాలు మీడియాలో వచ్చాయి. దీంతో  తెలుగుదేశం నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు.  ఈసీ స్పందించింది. చ‌ల్లా చంద్ర‌య్య‌తో పాటు 10 మందిని వెంట‌నే స‌స్పెండ్  చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. మ‌రోవైపు వెంక‌ట్రామిరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైఎస్ఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ , ఎన్నిక‌ల అధికారి కూడా   ప్ర‌భుత్వానికి సిఫార్సు చేశారు.  దీంతో ప్ర‌భుత్వం స్పందించి వెంక‌ట్రామిరెడ్డిని స‌స్పెండ్ చేసింది. వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ అధికారి హోదాలో ఉండి ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేసిన వెంక‌ట్రామిరెడ్డి.. ఎన్నిక‌ల కోడ్ లోనూ వైసీపీ కార్య‌క‌ర్త‌గానే వ్య‌వ‌రిస్తుండ‌టంతో ఈసీ కొర‌డా ఝుళిపించింది.  ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపైనా వేటుకు ఈసీ రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం దాదాపు ఖాయ‌మ‌నే  భావన అధికార వ‌ర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇప్ప‌టికే సీఎస్‌, డీజీపీపై ఎన్నిక‌ల సంఘానికి ప‌లు ఫిర్యాదు వెళ్లాయి. వీరు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నార‌ని, ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఫిర్యాదుల్లో పేర్కొన్నాయి. దీంతో డీజీపీ, సీఎస్, మ‌రికొంద‌రు అధికారుల‌పై అందిన ఫిర్యాదుల్లోని అంశాల‌పై సంబంధిత అధికారుల నుంచి వివ‌ర‌ణ తీసుకొని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించామ‌ని, ప్ర‌స్తుతం కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకునే నిర్ణ‌యం కోసం వేచిచూస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ చెప్పారు. దీంతో మ‌రో రెండుమూడు రోజుల్లో డీజీపీ, సీఎస్‌తో పాటు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారుల‌పై ఈసీ వేటువేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కూ ఈసీ షాకిచ్చింది. వైసీపీ ప్ర‌భుత్వంలో 40 మందికిపైగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఉన్నారు. వీరిలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితోపాటు ప‌లువురు ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తీనెలా ప్ర‌భుత్వ జీతం తీసుకుంటూ ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ప‌లువురు ఈసీకి ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదుల‌ను ఈసీ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందిస్తూ.. మంత్రుల‌తో స‌మానంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల‌కు ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. తాజా ప‌రిణామాల‌తో ఇక‌పై ఎవ‌రైనా ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు ఎన్నిక‌ల నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే వేటు వేసేందుకు ఈసీ సిద్ధ‌మైంది. ఈసీ నిర్ణ‌యంతో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నోటికి తాళంప‌డిన‌ట్ల‌యింది. ఈసీ తాజా నిర్ణ‌యంతో స‌జ్జ‌ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.
Publish Date: Apr 19, 2024 11:08AM

బెండకాయలతో బోలెడంత ఆరోగ్యం..

చిన్నపిల్లలు బెండకాయలు తినమని మారాం చేస్తే చాలా మంది తల్లులు మాయ చేస్తారు.  బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని, తెలివితేటలు పెరుగుతాయని చెప్పి ఏదో ఒక విధంగా తినిపిస్తారు. నిజానికి బెండకాయలో ఉండే జిగురు మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇక బెండకాయలు తింటే లెక్కలు బాగా రావడం, బుద్దిగా చదువుకోవడం అనే మాట అటుంచితే బోలెడు లాభాలు మాత్రం చేకూరుస్తాయి. క్రమం తప్పకుండా బెండకాయలు తింటూ ఉంటే కింది ఆరోగ్య ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలు ఎముకలు బలంగా ఉండటంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్-కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బోలు ఎముకల వ్యాధి, ఎముకల బలహీనత వంటి సమస్యలు ఆమడ దూరంలో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి బెండకాయలు ది బెస్ట్. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. ఒకటి కరిగే ఫైబర్, రెండోది కరగని ఫైబర్. కరిగే ఫైబర్ జీర్ణాశయంలో జెల్ లాంటి పదార్థం ఏర్పరుస్తుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఆహారం నుండి చక్కెరలు కూడా నెమ్మదిగా విడుదల అవుతాయి. ఈ ప్రాసెస్ లో కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బరువు పెరగరు. ఇక కరగని ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది. బెండకాయల్లో ఫోలెట్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి గర్భిణిలకు చాలా మంచివి. మహిళలో ఎక్కువగా ఎదురయ్యే ఎముక సంబంధ సమస్యలను ఇవి దూరం చేస్తాయి. మధుమేహం ఉన్నవాళ్లకు బెండకాయ బెస్ట్ ఫుడ్. వీటిలో ఉండే పీచు పదార్థం చక్కెరలు నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది.  ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. బెండకాయలలో ఉండే పైబర్, పోషకాలు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతాయి. క్రమం తప్పకుండా బెండకాయ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ ఊహించని విధంగా  తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్-ఎ చాలా అవసరం. ఈ విటమిన్-ఎ బెండకాయల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే బెండకాయలు రెగ్యులర్ గా తింటే కంటి చూపు మెరుగవుతుంది. పిల్లలకు ఇది చాలా మంచిది. బెండకాయలలో ఉండే పీచు పదార్థం జీర్ణ సమస్యలను అన్నింటిని దూరం చేస్తుంది. బెండకాయలలో విటమిన్-సి కూడా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా జబ్బులను ఎదుర్కోనే శక్తి శరీరానికి లభిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా బెండకాయలు తరచుగా తినేవారు యవ్వనంగా ఉంటారు.దీనికి కారణం బెండకాయలలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరానికి కొల్లాజెన్ బాగా అందుతుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది.                                                   *నిశ్శబ్ద.  
Publish Date: Apr 19, 2024 10:37AM