బాబ్లీ కేసులో బాబుకి ఊరట
posted on Oct 12, 2018 2:40PM
బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొంత ఊరట లభించింది.బాబు వేసిన నాన్ బెయిలబుల్ రీకాల్ వారెంట్కు ధర్మాబాద్ కోర్టు అనుమతినిచ్చింది.వ్యక్తిగత హాజరు నుంచి చంద్రబాబుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది.చంద్రబాబుపై జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు వేసిన రీకాల్ పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి.చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూత్రా, సుబ్బారావు వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి కావడంతో వ్యక్తిగత హాజరు సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు.గంటన్నర పాటు సాగిన వాదనల అనంతరం ఈ నెల 15వ తేదీన వ్యక్తిగత హాజరు నుంచి సీఎం చంద్రబాబుకు మినహాయింపు ఇస్తున్నట్లు ధర్మాబాద్ కోర్టు తీర్పునిచ్చింది.అయితే నవంబర్ 3వ తేదీన హాజరు కావాలని కోర్టు సూచించగా కేసు పూర్తి అయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది.
'బాబ్లీ కేసు వ్యవహారమై మీడియాలో వివరాలు వచ్చాకే నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తెలిసింది.రాజకీయ ప్రతీకారంతోనే ఈ కేసు వేశారు.ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎటువంటి సమన్లు, కోర్టు నోటీసులు అందలేదు.పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తీవ్రమైనవేమీ కావు.నాన్బెయిలబుల్ వారెంట్ ఉపసంహరించడానికి ఇది తగిన కేసు.ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల నేపథ్యంలో వారెంట్ రీకాల్ సమయంలో నిందితుడు న్యాయస్థానంలో హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని 2018 జులై 05న జారీచేసిన నాన్బెయిలబుల్ వారెంట్ను రీకాల్ చేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిటీషన్లో కోరారు.