పంతం నెగ్గించుకున్న ధోనీ
posted on Aug 22, 2012 1:27PM
గురువారం నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, కివీస్ జట్లమధ్య తొలి టెస్ట్ మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో ఆరు పిచ్ లున్నాయి. రెండు మూడు వికెట్లను హెచ్ సీఏ సిద్ధం చేసింది. కెప్టెన్ ధోనీ మాత్రం రెండో వికెట్ కావాలని పట్టుబట్టాడు. స్పిన్ వికెట్ చేతిలో ఉంటే కివీస్ ని ముప్పు తిప్పలు పెట్టొచ్చని ధోనీ భావిస్తున్నాడు. మూడో వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉండడం, పగుళ్లు ఎక్కువగా ఉండడంవల్ల ధోనీ దాన్ని పక్కన పెట్టేశాడు. బీసీసీఐ నుంచి కూడా పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో హెచ్ సీఏకి ధోనీ మాట వినక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. కిందటిసారి ఈ వికెట్ మీద బౌలింగ్ లో రాణించలేకపోయిన స్పిన్నర్ హర్భజన్ బ్యాటింగ్ లో మాత్రం అదరగొట్టి సెంచరీ సాధించాడు. స్పిన్ మాయాజాలంలో ఆరితేరిన హర్భజన్ అప్పట్లో "ఈ పిచ్ ని తయారుచేసిన క్యూరేటర్ హైవేలు నిర్మించడానికి బాగా పనికొస్తాడంటూ" వ్యంగ్యాస్త్రాలుకూడా సంధించాడు. గతంలో హర్భజన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుపెట్టుకున్న క్యూరేటర్.. ఈ సారి మాత్రం వికెట్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు.