వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు

posted on: Feb 22, 2012 11:21AM

హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై..9 రోజులు గడిచినా..ఒక్క చర్చా జరగలేదు. సభలో స్పీకర్‌ నాదెండ్లతో పాటు సిఎం-అధికారపార్టీ సభ్యులు మాత్రమే సభలో అరకొరగా మాట్లాడారు. ఉపఎన్నికల నోటిఫికేషన్‌తో అన్ని పార్టీలు సభను ఇప్పుడు ఎన్నికల లబ్ది కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రజాసమస్యల కోసం విపక్షాలు చొరవ తీసుకోకపోవడం..చర్చించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఐదు రోజుల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ..మద్యం సిండికేట్లపై టీడీపీ, తెలంగాణ పై టీఆర్ఎస్ పట్టువీడకపోవడంతో సభ వాయిదాల పర్వంలో నడిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో స్పీకర్‌ విజ్ఞప్తులే బాహ్యప్రపంచానికి కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, సభ జరక్కపోవడానికి ఉపఎన్నికల నోటిఫికేషన్ ఒక కారణమైందనే వాదన వ్యక్తమవుతోంది. ఉపఎన్నికల నోటీఫికేషన్ తో రాజకీయ పార్టీల వ్యూహప్రతివ్యూహాల్లో భారీ మార్పు వచ్చాయని...ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే, ఈ వ్యూహంలో ఒక భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చ జరిపితీరాల్సిందేనని పట్టుబడుతున్న టీడీపీ అవసరమైతే... రాత్రంతా అసెంబ్లీలోనే ఉండాలని నిర్ణయించుకుంది.


11మంది టీఆర్ఎస్ సభ్యలుపై రెండు రోజులపాటు సస్పెన్షన్ వేటు పడింది. అంతకు ముందు సభ అరగంట వాయిదా తర్వాత ప్రారంభం అయినా టీఆర్ఎస్ సభ్యులు తమ పట్టు వీడలేదు. విద్యార్తులపై కేసులు ఎత్తవేయాలంటూ వారు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించుకుందామని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అయినా టీఆర్ఎస్ సభ్యుల తీరు మారకపోవటంతో  మంత్రి ధర్మాన సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు టీఆర్ఎస్ సభ్యులపై చర్య తీసుకునేందుకు..సభాపతి నాదెండ్ల అనుమతి తీసుకున్నారు.
 

ఇదిలావుండగా, సభ వాయిదా పడిన అనంతరం వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, శోభానాగిరెడ్డి బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని, కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ దాంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ సమక్షంలోనే ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయరెడ్డిని పిలిపించారు. నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయాలని మంత్రికి స్పీకర్ సూచించారు. కలెక్టర్ నివేదిక రాగానే స్పందిస్తామని ఆనం తెలిపారు. కాగా తనను స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి స్పీకర్ను కోరారు. అయితే సీఎల్పీ కాపీ అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు సమాచారం.


కాగా తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మద్యం సిండికేట్లలో అక్రమాలకు పాల్పడ్డ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను వెంటనే తొలగించాలని దూళిపాళ్ల డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ మోపిదేవిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులపై చర్యలకు ఎసిబి వెనుకాడుతోందన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...