సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ

posted on: Feb 22, 2012 9:00AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించుకున్నారు. అప్పుడు ఖమ్మం మద్యం సిండికేట్ లీడర్ నున్న వెంకటరమణ రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడం... ఇప్పుడు నున్న రమణ కస్టడీ రిపోర్టులో 'సిండికేట్ల మధ్య రాజీ కుదిర్చినందుకు మోపిదేవికి రూ.10 లక్షలు ఇచ్చాం' అని నున్న చెప్పినట్లుగా బయటపడటంపై మంత్రి మోపిదేవి రగిలిపోయారు. మంగళవారం సాయంత్రం హుటాహుటిన సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కిరణ్‌తో మోపిదేవి ముక్కుసూటిగా, కాసింత ఆగ్రహంగానే మాట్లాడారు. "ఆరోపణలు రావడం సాధారణమే అనుకున్నాను. వీటిపై ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని ఇంతకాలం భావించాను. కానీ... నన్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది'' అని నిష్కర్షగా చెప్పేశారు. "సహచర మంత్రిపై ఆరోపణలు వస్తే సీఎంగా మీరు మౌనంగా ఉంటే ఎలా? ఒకసారి ఆరోపణలు వచ్చినా మీరు ఖండించలేదు. రెండోసారీ ఏసీబీ నా పేరు లీక్ చేసింది. మిమ్మల్ని పది రోజుల కిందటే కలిశాను.

దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరాను. ఏసీబీ మీ పరిధిలోనే పని చేస్తుంది. అప్పుడే మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడిదాకా వచ్చే దే కాదు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇప్పటి దాకా ప్రతి రోజూ అసెంబ్లీలో ఇదే అంశంపై గందరగోళం జరుగుతోం ది'' అని మోపిదేవి సీఎంతో అన్నారు. మోపిదేవి ఆగ్రహంతో తన వాదన వినిపిస్తుండగా... సీఎం ఆయన భుజం తట్టి అనునయించారు. గురువారం ఈ అంశం శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లోగా వాస్తవాలు వెల్లడైతే బాగుంటుంది' అని రమణ చెప్పారు. ఆయన ఎంత సేపు మాట్లాడినా సీఎం 'కూల్ రమణా! ఏమీ కాదులే' అనడం తప్ప నిర్దిష్టంగా ఏ హామీ ఇవ్వలేదు. దీంతో మోపిదేవి కాస్త ఆగ్రహంగానే బయటకు వచ్చారు. కాగా, సభలో కిరణ్ తనకు అండగా నిలవకపోతే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి... కిరణ్‌కే లేఖ ఇవ్వాలని, ఆ తర్వాత గాంధీ భవన్‌కు వెళ్లి పార్టీకీ గుడ్‌బై చెప్పాలని మోపిదేవి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కిరణ్‌తో భేటీ అనంతరం మోపిదేవి పలువురు మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...