రాయపాటి చూపు…తెలుగుదేశం వైపు

 

కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేస్తారని భావించిన రాయపాటి సాంబశివరావు.. ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. నాలుగు సార్లు లోక్ సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, ఈసారి గుంటూరు వదిలి నరసరావుపేట వైపు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరులో రాయపాటి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఏం చేయాలో ఆయన నిర్ణయించుకునేలోపే గల్లా జయదేవ్ టీడీపీలో చేరిపోవడం, ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ దాదాపుగా ఖరారైపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు రాయపాటి నరసరావుపేట ఎంపీ టికెట్ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారని సమాచారం. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ రాయపాటి తన ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు సమాచారం. ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుంటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ తరువాత నరసరావుపేట పార్లమెంటు టికెట్ కేటాయింపు అంశం ఒక కొలిక్కి రావచ్చని జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.