అమ్మాయిలూ జాగ్రత్త
posted on Nov 29, 2019 12:14PM
వరుస ఘటనలు అమ్మాయిలను, అమ్మాయిల తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. వరంగల్లో 19 ఏళ్ల మానసను ఆమె మిత్రుడే రేప్ చేసి చంపేశాడు. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిని గుర్తు తెలియని దుండగులు రేప్ చేసి కిరాతకంగా హత్య చేసారు. ఇలా వరుస ఘటనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అమ్మాయిలు అంత గుడ్డిగా నమ్మి ఎవరితోనూ ఒంటరిగా వెళ్లొద్దని, ఒకవేళ రాత్రి సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే.. తోడుగా కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలని లేదా దగ్గరలోని పోలీసుల సహాయం కోరాలని.. పోలీసులు సూచిస్తున్నారు.
తాజా ఘటనల నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కొన్ని సూచనలు చేసారు. సాయంత్రం 6 దాటిన తరువాత, రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ప్రయత్నించే సమయంలో వాహనం చెడిపోయినా, పంక్చర్ అయినా సహాయం కోసం పోలీసులను ఆశ్రయించవచ్చని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని మిమ్మల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సహాయపడతారన్నారు. పోలీసుల సహాయం కోసం 100 డయల్ చేయొచ్చు లేదా రాచకొండ వాట్పాప్ నెంబరు 9490617111కు సమాచారం అందించవచ్చని సీపీ తెలిపారు. కొన్ని మానవ మృగాలు సంచరిస్తున్న ఈ సమాజంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అమ్మాయిలూ జాగ్రత్త. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా, భయం వేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.