రామ్ చరణ్ సాయం..పవన్ కి మనోజ్ ధన్యవాదాలు

 

తిత్లీ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.భాదితులకు పలువురు సినీ ప్రముఖులు బాసటగా నిలిచారు.తాజాగా రామ్ చరణ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించిన సంగతి తెలిసిందే.తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన సలహా మేరకు ఆనందంగా ఈ పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో కథానాయకుడు మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు.

‘మన నుంచే ఇది ప్రారంభం కావాలి.. నీ సోదరుడిగా ఎప్పుడూ గర్వపడుతూనే ఉన్నాను. గ్రామాన్ని దత్తత తీసుకోవడం నిజంగా ఓ గొప్ప పని. అవసరాల్లో ఉన్న ప్రజలకు మంచి చేయాలని తెలుపుతూ రామ్‌చరణ్‌కు స్ఫూర్తి కల్గించిన పవన్‌కల్యాణ్‌ గారికి ధన్యవాదాలు’ అని మనోజ్‌ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు పవన్‌, చరణ్‌ కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

 


హీరో నిఖిల్ కూడా ప్రభావిత ప్రాంతాలకు స్వయంగా వెళ్లి సాయం చేసిన సంగతి తెలిసిందే.నిఖిల్ కూడా టాలీవుడ్ అందిస్తున్నసాయంపై ట్వీట్ చేశారు.‘‘తిత్లీ’ బాధితుల కోసం పెద్ద మనసుతో 750 నిత్యావసర సరకుల కిట్లు పంపిన రానాను, సరకులు పంపిన మంచు మనోజ్‌ను,విరాళాలు అందించిన అల్లు అర్జున్‌,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,విజయ్ దేవరకొండ,వరుణ్ తేజ్,సంపూర్ణేష్ ను, గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన రామ్‌చరణ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. శ్రీకాకుళం బాధితులకు సహాయం చేసిన మిగిలిన వారందికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.