తెలంగాణ బిల్లుకు రెడ్ సిగ్నల్
posted on Feb 11, 2014 9:24AM
రాష్ట్ర విభజన రాజకీయాలు దేశ రాజధానిలో అనూహ్యమలుపులతో..ప్రతి క్షణం ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర విభజన బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకున్న కాంగ్రెస్ అధిష్టాన వ్యూహానికి సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ బ్రేక్ వేసినట్లు కనిపిస్తో౦ది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు...ముఖ్యమైన అంశాన్ని రాజ్య సభలో ప్రవేశపెట్టడం పై ఆయన అభ్య౦తరం వ్యక్తం చేశారు.
ఇది ఆర్థిక నిర్ణయాలతో ముడిపడి ఉన్న బిల్లు. అందువల్ల తొలుత లోక్సభలో ప్రవేశపెట్టాలని అంటున్నారు కదా... అని కేంద్ర హోంశాఖ అధికారులను హమీద్ అన్సారీ ప్రశ్నించారు. పూర్తిస్థాయి ద్రవ్య బిల్లులను మాత్రమే తొలుత లోక్సభలో ప్రవేశపెట్టాలనే నిబంధన ఉందని కేంద్రం బదులిచ్చింది. దీనిపై హమీద్ అన్సారీ సంతృప్తి చెందలేదు. బిల్లును ముందుగా తమ సభకు పంపించాలనుకుంటే... దాంతోపాటు న్యాయసలహా కూడా జత చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో విభజన రాజకీయాలు అనుకొని మలుపు తిరిగింది.
రాష్ట్రపతి నుంచి విభజన బిల్లుకి అనుమతి వచ్చినప్పటికీ..ఉపరాష్ట్రపతి దానికి రెడ్ సిగ్నల్ వేయడంతో బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతరా? లేదా?...ముందుగా ఏ సభలో ప్రవేశపెడతారు అన్న దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.