రాహుల్ ప్రచార వాహనాన్ని ఢీకొన్న రైలు

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనలో ప్రచారం కాన్వాయ్‌లో వుండే జామర్ వాహనాన్ని పోలీసులు సిద్ధం చేశారు. ఈ వాహనం హిందూపురం సమీపంలోని గుడ్డం దగ్గర గేటులేని రైల్వే ట్రాక్‌ని దాటుతున్న సమయంలో బెంగుళూరు వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్ ప్రెస్ ఢీకొంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన పోలీసు సిబ్బంది సదరు వాహనంలోంచి బయటకి దూకేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడిన జామర్ వాహనం డ్రైవర్ని హిందూపురం ఆస్పత్రికి తరలించారు.