రాహుల్ రాష్ట్ర పర్యటన..తెలంగాణ పై నిర్ణయం!
posted on Feb 17, 2013 9:32AM
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో కూడా తాను తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని పాలో అవ్వడమే తన వంతు అని కిరణ్ స్పష్టం చేశాడు. విధాన నిర్ణయాలు పార్టీయే తీసుకుంటుందని, పార్టీని కాదని ఏమీ చేయలేమన్నారు. పార్టీ టికెట్ ఇస్తేనే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. రాహుల్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి …సమావేశ వివరాలను తెలిపారు.
తమ సమావేశం గురించి మీడియాలో వచ్చిన వార్తలు కల్పనలేనని తేల్చేశారు. తాము పార్టీ బలోపేతం గురించి మాత్రమే రాహుల్ చర్చించామని కిరణ్ అన్నారు. ఇక పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారి గురించి మాట్లాడుతూ… తమ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లినా ఢోకా లేదన్నారు. పాత వెళ్లిపోతే కొత్తవారు వస్తారన్నారు. తమకు 294 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాడానికి తగిన అభ్యర్థులున్నారన్నారు. రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తూ…విద్యుత్ ఉత్పత్తి కోసం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు మేలు చేసేందుకు ఏం చేయాలనే దానిలో సమాలోచనలు జరిపామన్నారు. రైల్వే బడ్జెట్ పై రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపామన్నారు. ఇక ఈ సమావేశం గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…త్వరలోనే రాహుల్ రాష్ట్రపర్యటనకు రానున్నారని తెలిపారు.