మనసు మార్చుకున్న ప్రత్తిపాటి... త్వరలోనే కీలక నిర్ణయం వెల్లడి

గుంటూరు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు..మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పార్టీలో కీలక నేత. 2004-2009 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసారు. అధికారంలోకి రావడంతోనే మంత్రయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా.. మంత్రిగా.. టిడిపిని ముందుండి నడిపించారు. ఐదేళ్ళు మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి గత ఎన్నికల్లో తన శిష్యురాలి చేతిలోనే ఓడిపోయారు.
ఓటమి తర్వాత కొంత కాలం హడావుడి చేసిన ఆయన ఇప్పుడు పూర్తిగా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తర్వాత మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో ప్రత్తిపాటి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరులో లీడ్ తీసుకున్నారు. పార్టీ బలోపేతం దిశగా ఆలోచనలు చేశారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే పల్నాడు నేత కోడెల శివ ప్రసాద్ మరణం తరువాత ప్రత్తిపాటిలో ఒక్కసారిగా మార్పొచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం మానేశారు. జిల్లా రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెలలో లోకేష్ పొన్నూరు పర్యటనకు కూడా రాలేదు. వల్లభనేని వంశీ, అవినాష్ వంటి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు కూడా ప్రత్తిపాటి నుంచి రియాక్షన్ లేదు. రెండు నెలలుగా పార్టీ స్టేట్ ఆఫీసులో పుల్లారావు ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనలేదు. గతంలో చిలకలూరిపేటలో నివాసముండే ఆయన ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రత్తిపాటి మౌనం వెనుక పార్టీ మరో ఎజెండా ఉందా అని డిస్కషన్ నడుస్తుంది. గతంలో ఆయన బిజెపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన వాటిని కొట్టి పారేశారు. అయితే రెండు నెలలుగా సైలెంట్ గా ఉండటం వెనుక కారణాలేంటనే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా వేచి చూసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ప్రత్తిపాటి ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి ప్రత్తిపాటి రానున్న రోజుల్లో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని నియోజక వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.